దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి: కేసీఆర్ నివాళులు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థీవ దేహం వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు నివాళులర్పించారు.
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థీవ దేహం వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు నివాళులర్పించారు.
అనారోగ్యంతో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే రామలింగారెడ్డి బుధవారం నాడు రాత్రి మరణించారు. మృతదేహాన్ని ఇవాళ తెల్లవారుజామున స్వగ్రామం చిట్టాపూర్ కు తరలించారు కుటుంబసభ్యులు.
గురువారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ రామలింగారెడ్డి మృతదేహం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతకుముందు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డికి నివాళులర్పించారు.తెలంగాణ ఉద్యమంతో రామలింగారెడ్డికి ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకొన్నారు.
తొలుత ఆయన జర్నలిస్టుగా పనిచేశాడు. పలు పత్రికల్లో ఆయన పనిచేశారు. వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధనకై నాటి ఏపీయూడబ్ల్యుజెలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన మెదక్ జిల్లాలో పనిచేసిన సమయంలో ఆయనపై టాడా కేసు కూడ నమోదైంది. జర్నలిస్టుపై టాడా కేసు నమోదు కావడం కూడ ఇదే తొలిసారి కావడం గమనార్హం.