Munugode ByPoll 2022: ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీకానున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ ద్వారా ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించాలని టీఆర్ఎస్ చూస్తోంది.
మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీకానున్నారు. కేబినెట్ సమావేశం కంటే ముందు కొద్దిసేపు నేతలతో మాట్లాడిన కేసీఆర్ .. మంత్రివర్గ సమావేశం తర్వాత మళ్లీ కలుద్దామంటూ నేతలతో చెప్పారు.
కాగా... మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా వ్యుహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ ద్వారా ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఇప్పటికే గత వారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించగా.. బీజేపీ ఆగస్టు 21న సభ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆగస్టు 25న మునుగోడులో టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయాలని చూస్తోంది. అయితే ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని టీఆర్ఎస్ వర్గాలు తెలపాయి. అయితే జిల్లాల పర్యటన చేపట్టనున్న కేసీఆర్.. అక్కడ సభల వేదికగా మునుగోడు అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే మునుగోడులో నిర్వహించే సభకు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత జగదీష్ రెడ్డి సారథ్యం వహించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే మునుగోడులో లో ప్రొఫైల్ను అవలంభిస్తోంది. అయితే అంతర్గతంగా ప్రణాళికలను సిద్దం చేస్తుందని.. ఎన్నికలు సమీపించే సమయంలో వాటిని అమలు చేస్తోందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన క్యాడర్పై టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సైలెంట్గా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి.