సభ్యులు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు: బీఏసీ మీటింగ్లో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని ఆయన అన్నారు. కరోనా అదుపులోనే వుండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయించారు
తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని ఆయన అన్నారు. కరోనా అదుపులోనే వుండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయించారు. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయం వుండాలని, జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు కేసీఆర్. ప్రభుత్వం తరపున ఐటీ, పరిశ్రమలు, హరితహారం అంశాలపై చర్చిస్తామన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. సభ్యుల సంఖ్య తక్కువగా వున్నా .. విపక్షాలకు సమయం ఎక్కువగానే ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకుని దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం కోరారు.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly session) శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల కాలంలో మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు (Former mlas) సభ సంతాపం తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించి మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు సంతాపం తెలిపింది. కుంజా బొజ్జి, ఆజ్మీరా చందూలాల్, సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం,చేకూరి కాశయ్య తదితరుల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.