వాసాలమర్రికి ప్రత్యేక అధికారి నియామకం: గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులిచ్చిన కేసీఆర్
వాసాలమర్రి అభివృద్ది కోసం జిల్లా కలెక్టర్ పమెలా పత్పతిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
యాదగిరిగుట్ట: వాసాలమర్రి అభివృద్ది కోసం జిల్లా కలెక్టర్ పమెలా పత్పతిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.మంగళవారం నాడు వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను ఆయన తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
also read:సుప్రజను ఎంబీబీఎస్ చదివిస్తా: వాసాలమర్రిలో కేసీఆర్
గ్రామాభివృద్ది కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ కమిటీలు గ్రామాభివృద్ది కోసం గ్రామస్తులతో చర్చించి ప్లాన్ తయారు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ది కోసం సహకరిస్తారని చెప్పారు. అంకాపూర్ లో ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ది కమిటీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో కూడ ఈ తరహ కమిటీలు ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అంకాపూర్ లో తాను 1987లో పర్యటించిన సమయంలో గ్రామాభివృద్ది ఏర్పాటు చేసిన బ్యాంకుల్లో కోట్లాది రూపాయాలున్నాయన్నారు. అంకాపూర్ లో రైతులు పండించిన పంటలు ఎక్కడ విక్రయిస్తే లాభాలు వస్తాయనే విషయమై గ్రామాభివృద్ది కమిటీ విచారణ చేసి అక్కడే పంటలను విక్రయిస్తారని తెలిపారు.
ఎర్రవెల్లి గ్రామం కూడ అభివృద్ది చెందిందని చెప్పారు. ఇదే తరహాలో వాసాలమర్రి గ్రామం కూడ అభివృద్ది చెందాలన్నారు. భువనగరి జిల్లాలోని గ్రామపంచాయితీలకు తన నిధుల నుండి రూ. 25 లక్షలను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 50 లక్షలను విడుదల చేస్తున్నామన్నార. భువనగిరి మున్పిపాలిటీకి కోటి రూపాయాలు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.