పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు కేసీఆర్ భారీ నజరానా.. ఇల్లు, ఖర్చుల కోసం రూ.కోటి రివార్డ్
ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు (darshanam mogilaiah) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భారీ నజరానా ప్రకటించారు. ఆయనకు ఇల్లు, ఖర్చుల నిమిత్తం రూ.కోటి ప్రకటించారు కేసీఆర్. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు (darshanam mogilaiah) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భారీ నజరానా ప్రకటించారు. ఆయనకు ఇల్లు, ఖర్చుల నిమిత్తం రూ.కోటి ప్రకటించారు కేసీఆర్. శుక్రవారం ప్రగతి భవన్లో మొగిలయ్యను సన్మానించారు సీఎం. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు (k chandrashekar rao) మాట్లాడుతూ.. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ కళాకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్ అన్నారు. మొగిలయ్య తెలంగాణ కళను పునరుజ్జీవింపజేశారని సీఎం ప్రశంసించారు.
కాగా.. శభాష్ 'భీమలా నాయకా' (bheemla nayak) అంటూ దర్శనం మొగిలయ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు మొగులయ్య. అంతకు ముందు వరకు మొగిలయ్య ఎవరికీ తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ కోసం ప్రారంభ లిరిక్స్ ని మొగిలయ్య తనదైన శైలిలో పాడి మెప్పించారు.
భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలయ్యాక మొగిలయ్యని పలు మీడియా సంస్థలు పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేశాయి. దీనితో మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా మొగిలయ్య కిన్నెర కళని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు (padma shri award) ప్రకటించింది.
ఇది మొగిలయ్యకు, కిన్నెర కళకు దక్కిన గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ విభిన్నంగా ఉండాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ భావించారు. అందుకే మొగిలయ్య ప్రతిభని గుర్తించి ఆయనతో భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడించారు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా మొగిలయ్యని అభినందించిన సంగతి తెలిసిందే. మొగిలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం కూడా చేశారు.
ఇకపోతే... పలు రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘‘పద్మ’’ పురస్కారాలను (padma awards) కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో (bipin rawat) పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్తో పాటు కొవిషీల్డ్ (covishield) టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ అధినేత సైరస్ పూనావాలా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (sundar pichai) , మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను (satya nadella) పద్మభూషణ్ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.
ఈ లిస్ట్లో పలువురు తెలుగువారు కూడా స్థానం సంపాదించుకున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. కొవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్ (covaxin) టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ (bharat biotech) సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ (కళారంగం); డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం); గరికపాటి నరసింహారావు ఉండగా.. తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.