రేపటి నుండి రూ. 50 వేలలోపు పంట రుణాల మాఫీ: కేసీఆర్
రేపటి నుండి రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. హైద్రాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు.
హైదరాబాద్: రేపటి నుండి రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హైద్రాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించకొని ఆదివారం నాడు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వ్యవసాయం దండగగా ఉండేదన్నారు. తమ ప్రభుత్వం అవలంభించిన విధానాలతో వ్యవసాయం పండుగగా మారిందన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలున్నాయన్నారు. కానీ తాము చేపట్టిన సంస్కరణలతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు.
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రైతులు దేశానికే అన్నంపెట్టే స్థాయికి చేరుకొన్నారన్నారు. తెలంగాణ రైస్ భౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందన్నారు.దశలవారీగా పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు.విద్యుత్, సాగు నీటి రంగంలో ఇబ్బందులు లేకుండా చేసినట్టుగా చెప్పారు.
రైస్ భౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఆయన చెప్పారు.చేనేతల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. చేనేత కార్మికుల కూడ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తైతే రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారనుందన్నారు సీఎం.ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్