కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ దోపిడీని ఆపకుంటే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విక్రమార్క హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు భూములను ఆక్రమిస్తూ .. ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు ప్రజలపై పడి.. కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసిన నాయకులను చూశాం కానీ, స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తోందన్నారు. పొలాల దగ్గరే కాపాలాగా పడుకున్న రైతుల కష్టాలు చూశానని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు భూములను ఆక్రమిస్తూ .. ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుర్తుపై గెల్చి పార్టీకి ద్రోహం చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే.. రూ. వేల కోట్ల కాంట్రాక్ట్ల కోసం పార్టీ మారాడని ఆరోపించారు
పాదయాత్రలో డిగ్రీలు చదివిన నిరుద్యోగులుగా వున్న యువతతో మాట్లాడానని, పొలాల దగ్గరే కాపలాగా పడుకున్న రైతుల కష్టాలు చూశానని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో మెరుగైన పద్ధతిలో తీసుకొస్తామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్లో అన్ని వర్గాల ప్రజలను కలిశానని భట్టి వెల్లడించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నా.. నిరాశే మిగిలిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ దోపిడీని ఆపకుంటే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విక్రమార్క హెచ్చరించారు.
కాగా.. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ వంద రోజులు దాటిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్లో మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర నిరాటంకంగా పలు జిల్లాల గుండా సాగుతున్నది. పేద ప్రజలు, అట్టడుగు వర్గాలను కలుపుతూ ఆయన యాత్ర దిగ్విజయంగా సాగుతున్నది. ఈ యాత్ర కాంగ్రెస్ అధిష్టానం దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక ఎన్నికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో తదుపరి విజయాన్ని నమోదు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఇక్కడి రాజకీయ పరిణామాలను తెలుసుకుంటున్నారు.
సర్వేలు పరిశీలిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దృష్టికి భట్టి విక్రమార్క పాదయాత్ర వెళ్లింది. ఈ యాత్ర గురించి రాహుల్ గాంధీ ఆరా తీశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సహా ముఖ్య నేతల నుంచి ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురించి పాజిటివ్ కోణంలో అభిప్రాయాలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ భట్టిని ప్రశంసించినట్టు తెలిసింది.
