దేశం మొత్తం ఇంతే.. వాటినీ దర్యాప్తు చేయాల్సిందే : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై భట్టి విక్రమార్క స్పందన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్ట్ సీబీఐకి అప్పగించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీలు మారిన ఎమ్మెల్యేల లావాదేవీలపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును అప్పగించడాన్ని సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ వ్యవహారంపై తాము కూడా పీఎస్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కూడా దర్యాప్తు చేయాలన్నారు భట్టి. ఎవరు.. దేనికి అమ్ముడుపోయారన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీలు మారిన ఎమ్మెల్యేల లావాదేవీలపైనా సీబీఐ విచారణ జరిపించాలని తాము కూడా ఫిర్యాదు చేశామని విక్రమార్క గుర్తుచేశారు.
ఇదిలావుండగా.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ చెంచ్ కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లే వరకు తీర్పును సస్పెన్షన్ లో ఉంచాలని ఏజీ వినతికి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
ALso REad: కేసీఆర్ కు షాక్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణ సీబీఐ అప్పగింతకు హైకోర్టు సమర్ధన
కాగా.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో విచారణ చేసేందుకు తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్లో అనుమతి ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 26న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు విచారణకు గాను హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే డిమాండ్ తో పిటిషన్లను దాఖలు చేశారు.అయితే టెక్నికల్ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీజేపీ సహా మరొకరి పిటిషన్ ను కొట్టివేసింది.ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ పరిగణనలోకి తీసుకుంది. అంతేకాదు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ను కలిగించాయి.