CM Revanth Davos Tour: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. దావోస్కు సీఎం రేవంత్ టీం
CM Revanth Davos Tour: స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2024లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లనుంది.
![Telangana Chief Minister Revanth Reddy To WEF summit Davos On 15th KRJ Telangana Chief Minister Revanth Reddy To WEF summit Davos On 15th KRJ](https://static-ai.asianetnews.com/images/01hkhed0qacwvcp5exjwk1hv11/revanth-reddy-jpeg_363x203xt.jpg)
CM REVANTH DAVOS TOUR: స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జనవరి 15 నుండి జనవరి 18 వరకు జరిగే డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లనుంది.
నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. గత ఏడాది జనవరి మూడో వారంలో చివరి డబ్ల్యూఈఎఫ్ పర్యటన జరగ్గా, అప్పటి ఐటీ మంత్రి కెటి రామారావు నేతృత్వంలోని బృందం హాజరైంది. ఆ సమయంలో..కేటీఆర్ సుమారు రూ. 21000 కోట్ల పెట్టుబడులను పొందినట్లు సమాచారం.
తెలంగాణలో విదేశీ కంపెనీలు పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించనుంది.
ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ సమ్మిట్ కు వెళ్లనున్నారు. వీరితో సీఎం ముఖ్యకార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పెట్టుబడులు, ప్రచారం, విదేశీ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి హాజరుకానున్నారు.