అర్చకుల వయో పరిమితి 65 ఏళ్లకు పెంపు: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
హైద్రాబాద్లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 70 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది
హైదరాబాద్: హైద్రాబాద్లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 70 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే ఈ భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం రూ. సుమారు 70 కోట్లు కేటాయించనున్నారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగింది. మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వివరించారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు హరీష్ రావు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అర్చకుల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.
గోపాల మిత్రల వేతనాలను రూ.8500లకు, సెకండ్ ఎఏన్ఎంలకు వేతనాలను 21 వేలకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. కాంట్రాక్టు డాక్టర్ల వేతనాన్ని కూడ 40 వేలకు పెంచింది.
పలు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం అర్చకుల వయస్సు 58 ఏళ్లు. అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నట్టు మంత్రి రాజేందర్ ప్రకటించారు.మరో వైపు రెడ్డి హాస్టల్ నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాలను కూడ కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు.
గంట పాటు ఈ సమావేశం జరిగింది. వైద్యశాఖలో సుమారు 9 వేల మందికి వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రగతి నివేదన సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.