గవర్నర్ మేడారం పర్యటన రోజున నేరుగా సీఎంవో కార్యాలయం నుంచి డైరెక్షన్స్ వచ్చాయని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ . సీఎం హోదాలో అక్కడికి వెళ్లాల్సిందిపోయి.. అక్కడ మంత్రులు, అధికారులు ఎవరూ వుండొద్దంటూ ఆదేశాలు వెళ్లాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మేడారంలో గవర్నర్ పర్యటన సందర్భంగా మంత్రులు ఆమెను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (bandi sanjay kumar) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గవర్నర్ మేడారం పర్యటన రోజున నేరుగా సీఎంవో కార్యాలయం నుంచి డైరెక్షన్స్ వచ్చాయని ఆరోపించారు. సీఎం హోదాలో అక్కడికి వెళ్లాల్సిందిపోయి.. అక్కడ మంత్రులు, అధికారులు ఎవరూ వుండొద్దంటూ ఆదేశాలు వెళ్లాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
గవర్నర్ రాజకీయ నాయకురాలు కాదని.. తొలుత గవర్నర్ చాలా మంచిదని చెప్పిన ముఖ్యమంత్రికి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గవర్నర్ ప్రథమ పౌరురాలని.. ఒక మహిళ అని, అమ్మవారి దర్శనానికి వచ్చారని బండి సంజయ్ తెలిపారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయినా పూర్తికాలం వుండరని.. కొడుక్కి అప్పగించేస్తారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
కాగా.. గతవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) మేడారం (medaram jatara) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. గవర్నర్ను మంత్రులు రీసివ్ చేసుకోలేదు. గవర్నర్ వచ్చేసరికి అక్కడి నుంచి మంత్రులు వెళ్లిపోయారు. అయితే మంత్రులు లేకుండానే గిరిజనుల ఆరాధ్య దైవం .. సమ్మక్క- సారలమ్మలను (sammakka saralamma jatara) ఆమె దర్శించుకున్నారు.
మరోవైపు.. తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి స్పష్టమైన సమాధానం రాకపోయినా.. అవుననే రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత బలం చేకూరుస్తున్నాయి. గవర్నర్-ముఖ్యమంత్రికి దూరం పెరుగుతున్నదనే విషయాన్ని స్పష్టం చేసే విధంగా రిపబ్లిక్ డే లో ఏం జరిగిందనే దానితో పాటు అనేక అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్, సీఎం కార్యాలయం మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయాల్లో చర్చ జరగడానికి రిపబ్లిక్ డే వేడుకలు కేంద్ర బిందువుగా మారాయి. రాజ్భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు.
కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం గవర్నర్ తమిళిసై ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల రాజ్భవన్లో రెండు ఫిర్యాదుల బాక్సులను కూడా తమిళి సై సౌందరరాజన్ ఏర్పాటు చేశారు. ఇది సీఎం కేసీఆర్ సర్కారుకు నచ్చలేదని రాజకీయాల్లోని ఓ వర్గం పేర్కొంటోంది.
