ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: కేసీఆర్కు బండి సంజయ్ ఆల్టీమేటం
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచితే మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచితే మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానం వుందని బండి సంజయ్ తెలిపారు. హోంమంత్రికి పాతబస్తీకి మాత్రమే వున్నారంటూ మండిపడ్డారు.
కాగా, తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతో పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ దీనిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా శాఖలకు తెలిపారు సీఎం కేసీఆర్. కరోనా సంక్షోభంతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం హైదరాబాద్లోనే నెలకు 90 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని సీఎంకు తెలిపారు అధికారులు. తెలంగాణలోని మొత్తం 97 డిపోలు నష్టాల్లోనే నడుస్తున్నాయ్. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు అధికారులు.