రాజీనామా చేసి .. బీఆర్ఎస్ కండువా కప్పుకో : కామారెడ్డి కలెక్టర్పై బండి సంజయ్ తీవ్రవ్యాఖ్యలు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి జిల్లా కలెక్టర్పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్పై వుందని.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని, లేదంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించి, ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వున్న రెండెకరాలు కూడా ఇండస్ట్రియల్ జోన్కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
ప్రభుత్వం రైతులతో మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రెండు పంటలు పండించే రైతుల పొలాలను గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దీనినే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు వున్నాయని.. వాటిని ఇండస్ట్రియల్ జోన్ కింద తీసుకోవచ్చు కదా అని సంజయ్ ప్రశ్నించారు.
ALso REad: మాస్టర్ ప్లాన్: నేడు కామారెడ్డి బంద్, నేతల హౌస్ అరెస్టులు
ప్రశ్నించరని, ఎదురు తిరగరనే పేద రైతుల భూములు లాక్కొని వారి పొట్టకొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అధికారులు , బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై వారికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకుంటోందని సంజయ్ ఆరోపించారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ప్లాన్ను ఎందుకు బయటపెట్టలేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు కూడా రైతులు ఆందోళన చేయకుంటే విషయం బయటపడేది కాదని సంజయ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్పై వుందని.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని, లేదంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. రాత్రంతా కలెక్టరేట్ బయటే కూర్చొంటానని, కలెక్టర్ ఎందుకు రారో చూస్తానని సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతులు సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం పీకుతారంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రని సెటైర్లు వేశారు. తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన రాములు అసలు రైతే కాదని అంటున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.