ట్రిపుల్ ఐటీలో పిల్లల ఆహారాన్ని టీఆర్ఎస్ నేతలూ తినాలి.. ‘‘ చికోటి ’’ కేసులో పెద్దల పేర్లు : బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పిల్లలు తినే ఆహారాన్ని టీఆర్ఎస్ నేతలూ తినాలని ఆయన సవాల్ విసిరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ (bjp) లేదని కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం యాదాద్రిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... నెక్ట్స్ ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం ఏంటో చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ (kcr) ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. ఎంతో బాగున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ చెడగొట్టారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
నాణ్యత లేకుండా పనులు చేపట్టడం వల్లే అవి అప్పుడే కూలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నల్గొండ గడ్డపై పుట్టిన శ్రీకాంతాచారి ఎవరి కోసం బలయ్యాడని ఆయన ప్రశ్నించారు. పిడికెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ ఎవరికైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
Also REad:హుజురాబాద్లో గుద్దితే కేసీఆర్కు దిమ్మ తిరిగిపోయింది... బీజేపీకి 20 రాష్ట్రం తెలంగాణయే : ఈటల
దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఎంతమందికి వచ్చిందని బండి సంజయ్ నిలదీశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు పెడుతోన్న తిండిని ప్రభుత్వ పెద్దలు ఒకసారి తినాలంటూ ఆయన చురకలు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చికోటి ప్రవీణ్ (chikoti praveen kumar) వ్యవహారంలోనూ టీఆర్ఎస్ నేతల పేర్లు వినిపిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. మునిగే ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గురుకల పాఠశాలల్లో విద్యార్ధులు నరకం చూస్తున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.