అడ్డంగా సంపాదిస్తుంటే సోదాలు చేయొద్దా : మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై బండి సంజయ్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రజలను దోచుకుని అడ్డంగా సంపాదిస్తేనే సోదాలు చేశారని.. ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయాల్సిన బాధ్యత అధికారులపై వుందన్నారు. మరోనేత బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఐటీ దాడులు దేశంలో కొత్త కాదన్నారు. తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని.. దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్ చేయడం సరికాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు గురువారంనాడు మంత్రి మల్లారెడ్డి, తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని మల్లారెడ్డి చెప్పారు. ఇలాంటి రైడ్ ను తాను తన జీవితంలో చూడలేదని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మూడు రోజులుగా ఐటీ దాడులను కవర్ చేస్తున్న మీడియానే ఇబ్బంది పడితే తాము ఎంత ఇబ్బంది పడ్డామో ఆలోచించాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని అరాచకాలు చేస్తారో చేసుకోవాలని మల్లారెడ్డి చెప్పారు.
ALso REad:బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎవరినీ వదలం: మంత్రి మల్లారెడ్డి
తప్పులు చూపిస్తే ఫైన్ కడతామన్నారు. తాము దొంగలమా , క్రిమినల్స్ మా , డాన్లమా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ దాడుల విషయం తెలుసుకుని వచ్చిన కార్యకర్తలను దండం పెట్టి పంపించినట్టుగా మల్లారెడ్డి గుర్తు చేశారు. ఐటీ అధికారుల సోదాలకు తాను సహకరించినట్టుగా మల్లారెడ్డి వివరించారు. ఐటీ అధికారిని బంధించాలనుకొంటే తన నివాసంలోనే బంధిస్తానన్నారు. కానీ బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు ఎందుకు తీసుకెళ్తానని ఆయన ప్రశ్నించారు.
వందలాది మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చి సోదాలు నిర్వహించారన్నారు. తన పెద్ద కొడుకు మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన కొడుకు ఆసుపత్రిలో చేరిన విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.