ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ దిగి వచ్చి ఇప్పుడు ధాన్యం కొంటున్నారని..  ఈ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఎస్‌పీ రూ.1960 అని ప్రకటించింది కేంద్రమేనని బండి సంజయ్ గుర్తుచేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని మొదటి నుంచి చెబుతున్నామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) . ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దిగి వచ్చి ఇప్పుడు ధాన్యం కొంటున్నారని సంజయ్ అన్నారు. ఏ లెక్క ప్రకారం రూ.3 వేల కోట్లు నష్టం వస్తుందని సీఎం చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

తమపై దాడులు చేయించారని.. అయినా తాము వెనక్కి తగ్గలేదని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారని.. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఎస్‌పీ రూ.1960 అని ప్రకటించింది కేంద్రమేనని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇన్ని రోజులు తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంతకుముందు .. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని (paddy procurement) తామే కొంటామని సీఎం కేసీఆర్ (kcr) సంచలన ప్రకటన చేశారు. కొనుగోళ్ల కోసం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ వేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. యాసంగిలో పండించిన ప్రతిగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం ప్రకటించారు. 3-4 రోజుల్లోనే ధాన్యాన్ని కొంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్క గింజను కూడా తక్కువ ధరకు అమ్మొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. 

దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన తాము చూస్తూ ఊరుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. రూ.1960 మద్ధతు ధరకు ధాన్యం కొంటామని సీఎం వెల్లడించారు. మతపిచ్చితో దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మతోన్మాదుల కుట్రలో పడితే దేశం వందేళ్లు వెనక్కి వెళ్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని ఆయన ఫైరయ్యారు. దేశాన్ని చైతన్య పరిచే ఉద్యమంలో తాను ఖచ్చితంగా కీలకపాత్ర పోషిస్తానని సీఎం తెలిపారు. 

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు (piyush goyal) బుద్ధి వుందా అంటూ కేసీఆర్ ఫైరయ్యారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం అనేది బీజేపీ (bjp), ఆర్ఎస్ఎస్ (rss) వాళ్ల సిద్ధాంతమని సీఎం అన్నారు. రాష్ట్రాలను పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలంటున్న కేంద్రం, ఎందుకు వాటిపై పన్నులు తగ్గించదని ప్రశ్నించారు. 30- 35శాతం నూకల వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి ఇంత రచ్చ చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రానికి తన బాధ్యత గుర్తుచేయడం తమ లక్ష్యమన్నారు. ఒక చిన్న రాష్ట్రం పండించిన ధాన్యాన్ని కొనడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా అని కేసీఆర్ నిలదీశారు. 

అదాని గ్రూప్‌కి (adani group) పది వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిందని ఆయన గుర్తుచేశారు. రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ, కార్పోరేటర్లకు మాత్రం దోచిపెడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. రీసైక్లింగ్ చేయాలని కేంద్రమంత్రి మాట్లాడతారా అని ఆయన ఫైరయ్యారు. కేంద్రం చెప్పు చేతల్లో రాష్ట్రాలు వుండాలనేది బీజేపీ ఫిలాసఫీ అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం యాంటీ ఫెడరల్ సిద్ధాంతం పాటిస్తోందని సీఎం అన్నారు.