తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్... ఏఐజీ హాస్పిటల్లో చేరిక
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజిలో చేరి చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలో కరోనా వైరస్ (corona virus) కలకలం కొనసాగుతోంది. సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవ్వరినీ కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సహా అనేకమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డికి రెండవసారి కరోనా బారిన పడ్డారు.
స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో స్పీకర్ పోచారం టెస్ట్ చేయించుకున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినా డాక్టర్ల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ముందుజాగ్రత్త కోసమే ఆయన హాస్పిటల్ లో చేరినట్లు... ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులెవ్వరూ ఆందోళన చెందవద్దని స్పీకర్ సూచించారు.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన నేపథ్యంలో ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు. లక్షణాలుంటే టెస్ట్ చేయించుకోవడంతో పాటు ముందుజాగ్రత్తగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేసారు.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావు (keshav rao) కూడా కరోనా బారినపడ్డారు. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ (corona positive) గా నిర్దారణ అయ్యింది. అయితే కేశవరావుకు కరోనా వల్ల ఎలాంటి సమస్య లేకపోవడంతో హోంఐసోలేషన్ (home isolation) లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే వుంటూ కరోనా చికిత్స పొందుతున్నారు ఎంపీ కేశవరావు.
ఇక తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేసారు. అయితే ఆయన కోవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్లో ఉంటున్నట్టుగా చెప్పారు.
''జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటే ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాజిటివ్గా వచ్చింది. క్వారంటైన్ ట్రీట్మెంట్కు వెళ్తున్నా. ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని ఈ వీడియో చేస్తున్నాను'' అని అంబటి రాంబాబు ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు.
మంత్రి అవంతి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. స్వల్ఫ లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.