Telangana Assembly: మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, ఈ నెల 27 వరకు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు సమావేశం సంతాపం తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly session) శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల కాలంలో మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు (Former mlas) సభ సంతాపం తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించి మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు సంతాపం తెలిపింది. కుంజా బొజ్జి, ఆజ్మీరా చందూలాల్, సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం,చేకూరి కాశయ్య తదితరుల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.అంతకుముందు అసెంబ్లీ నిర్వహణకు గాను రెడ్యానాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేలతో ప్యానెల్ ఏర్పాటు చేసినట్టుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకొంటారు.