ప్రజా కూటమి సీఎంపీ ముసాయిదా ఖరారు: రేపు విడుదల
ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.
హైదరాబాద్: ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సోమవారం నాడు కూటమి నేతలు సమావేశమయ్యారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, ప్రజా యుద్దనౌక గద్దర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నందున సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు.
ముసాయిదా ప్రతి గురించి ఈ మూడు పార్టీల నేతలు మరోసారి సోమవారం నాడు చర్చించారు.ఈ సమావేశం నుండే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డికి ఫోన్ చేసి ముసాయిదా ప్రతి గురించి వివరించారు. ఈ ముసాయిదా పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టనున్న అంశాలనే ముసాయిదాలో పొందుపర్చినట్టుగా కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఈ విషయమై ముసాయిదాను మంగళవారం నాడు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సామాన్యులకు అనుకూలంగా ముసాయిదా ఉంటుందని నేతలు చెప్పారు. ముసాయిదాను ప్రజల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.