తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.