ఎమ్మెల్సీ ఎన్నికలు ఆపకపోతే హైకోర్టుకు వెళ్తాం: సిఈవోకు అఖిలపక్షం నేతల అల్టిమేటం
నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో హై కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి షెడ్యూల్ ఇచ్చి ఉదయం నోటిఫికేషన్ ఇవ్వడంపై అఖిలపక్షం నేతలు ఫైర్ అవుతున్నారు.
ఈ పరిణమాల నేపథ్యంలో అఖిలపక్షం నేతలు సిఈవో రజత్ కుమార్ ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ పై ఫిర్యాదు చేశారు. రాత్రి షెడ్యూల్ ఇచ్చి ఉదయం నోటిఫికేషన్ ఇవ్వడంపై నిలదీశారు. ఎన్నికలు వాయిదా వెయ్యాలని లేని పక్షంలో ఎన్నికలపై హై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ వస్తుందని ముందే తెలిసినట్లు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పుకొచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు వారాల పాటు ఎన్నికలు వాయిదా వెయ్యాలని లేకపోతే ఉద్యమిస్తామంటూ చెప్పుకొచ్చారు.
సిఈవో రజత్ కుమార్ ను తెలంగాణ కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతలు కలిశారు. కలిసిన వారిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కుసుమకుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతోపాటు సీపీఐ నేతలు కూడా ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నిక కాబోతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు కల్పించకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో హై కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 31న పోలింగ్, జూన్ 3న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ఇవాళ్లి నుంచి ఈనెల 14 వరకు నామినేసన్ల స్వీకరణ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.