తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై టెన్త్లో 6 పేపర్లే, పరీక్షా సమయంలోనూ మార్పులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఇకపై 6 పేపర్లే వుండనున్నాయి. 2022- 23 విద్యా సంవత్సరం నుంచే 6 పేపర్ల విధానం అమలు చేస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో ఇకపై ఆరు పేపర్లే వుండనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే టెన్త్లో ఆరు పేపర్ల విధానం అమలు చేయనుంది విద్యాశాఖ. అలాగే పరీక్షా సమయం 3 గంటలు కేటాయించగా.. సైన్స్ పేపర్కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
దీనిపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. వందశాతం సిలబస్తో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి, మార్చిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వ్యాసరూప ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్, సూక్ష్మ రూప ప్రశ్నలకు నో ఛాయిస్ అని ఆమె తెలిపారు. నమూనా ప్రశ్నాపత్రాలను విద్యార్ధులకు అందుబాటులో వుంచాలని మంత్రి సబిత ఆదేశించారు. వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహిస్తామని సబిత చెప్పారు. 2022- 23 విద్యా సంవత్సరం నుంచే 6 పేపర్ల విధానం అమలు చేస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.