మల్లన్నసాగర్ గుండెకాయ, బాధితులను ఆదుకోవాలి: సీఎస్ కు కేసీఆర్ ఆదేశం
భూ నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పటికే చాలా వరకు పూర్తైందన్న సీఎం మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చెయ్యాలని సీఎస్ ఎస్కే జోషిని ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల్లో పురోగతి, భూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై ఆరా తీశారు.
అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. భూ నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పటికే చాలా వరకు పూర్తైందన్న సీఎం మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చెయ్యాలని సీఎస్ ఎస్కే జోషిని ఆదేశించారు.
మల్లన్న సాగర్ జలాశయం పనుల్లో పురోగతి, భూ నిర్వాసితులకు ఉపాధి వంటి అంశాలపై స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. గ్రామాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ఓ గుండెకాయ లాంటిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, ఉపాధి, పునరావాసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే ప్యాకేజీని ఇస్తామని భరోసా ఇచ్చారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు రూ.800 కోట్లతో పరిహారం, పునరావాస కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.