మంత్రి ఈటెల రాజేందర్ మీద తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మీద తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిస్తానని ఆయన చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మీద తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మల్లన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు.
రాజకీయంగా ఈటెల రాజేందర్ ను కలవాల్సిన అవసరం తనకు లేదని తిన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో ఈటెలకు అన్యాయం జరుగుతుందనేది నిజమని అన్నారు ఈటెలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను ఇదివరకే ఖండించానని ఆయన గుర్తు చేశారు
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే, బిజెపి అభ్యర్థికి ఎందుకు ఓట్లు వేయించలేకపోయారని ఆయన అడిగారు బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏమిటని, తమ సిద్ధాంతాలు వేరని చెప్పారు. తాను బిజెపికి చెందిన వ్యక్తిని కానని, తనపై కుల ముద్ర వేయవద్దని ఆయన అన్నారు
కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి డబ్బులు గానీ వైఎస్ షర్మిల డబ్బులు గానీ తనకు అవసరం లేదని ఆయన అన్నారు. తనకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని ఆయన చెప్పారు. తన అనుచరులు ఒక్క రోజు టీ తాగకపోతే 5 కోట్ల రూపాయలు జమ అవుతాయని ఆయన అన్నారు.
బిజెపి సహా ఏ పార్టీలోనూ తాను చేరబోనని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని తాను పిలుపునిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న చెప్పారు. 45 కిలోల సీఎం కేసీఆర్ శరీరంపై తనకు ద్వేషం లేదని, కేసీఆర్ మెదడు తీసుకునే నిర్ణయాలనే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పారు
త్వరలో తెలంగాణవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ వార్తల్లో నిజం లేదని చెప్పారు. అసెంబ్లీ అంటే తెలియనివారిని తనతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని ఆయన చెప్పారు.