బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాల్లో సాంకేతిక సమస్యలు.. అర్ధం కానీ నేతల ప్రసంగాలు, స్ట్రీమింగ్
బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాల వర్చువల్ ప్రసంగాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కాషాయ శ్రేణులు గందరగోళానికి గురయ్యాయి. సంజయ్ ప్రసంగిస్తుండగానే కొన్ని చోట్ల నేతల ప్రసంగాలు స్ట్రీమింగ్ అయ్యాయి.
బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాల వర్చువల్ ప్రసంగాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఇక పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగిస్తుండగా కూడా సాంకేతిక లోపం తలెత్తింది. సంజయ్ ప్రసంగిస్తుండగానే కొన్ని చోట్ల నేతల ప్రసంగాలు స్ట్రీమింగ్ అయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ లేకపోవడంతో నేతలకు అర్ధంకాక ఇబ్బందులు పడ్డారు. దీంతో మధ్యలోనే రాష్ట్ర కార్యాలయం నుంచి స్ట్రీమింగ్ నిలిపివేశారు.
అంతకుముందు బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అన్నారు. కేంద్రం నిధులపై తెలంగాణ సర్కార్ తప్పుడు లేఖలు చెబుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చకు సిద్దమని ప్రకటించారు. కేంద్రం నిధులపై ఆధారాలతో సహా చూపిస్తామని అన్నారు. కేసీఆర్ రాజీనామా పత్రం పట్టుకుని చర్చకు రావాలని అన్నారు. రాజకీయాల గురించి కాదని.. అభివృద్ది గురించి మాట్లాడాలని అన్నారు.
Also REad: మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద జమ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారి ఇన్నేళ్లు గడిచినా ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం అని ఆరోపించారు.