పులివెందుల పులి జగన్ కాదు.. వైఎస్ సునీత, గుడివాడలో ‘‘ గొట్టంగాడు ’’ ఈసారి కష్టమే : బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు
పులివెందుల పులి వైఎస్ జగన్ కాదని.. వైఎస్ సునీత అన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఎవరు ప్రచారం చేసినా ఈసారి గుడివాడ గొట్టంగాడు గెలవడని బుద్ధా దుయ్యబట్టారు.
సీఎం వైఎస్ జగన్ , మాజీ మంత్రి కొడాలి నానిలపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పులివెందుల పులి జగన్ కాదని, వైఎస్ సునీత అని వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వున్నందునే జగన్ తన గుడివాడ పర్యటనను రద్దు చేసుకున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఎవరు ప్రచారం చేసినా ఈసారి గుడివాడ గొట్టంగాడు గెలవడని బుద్ధా దుయ్యబట్టారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపైనా బుద్ధా వెంకన్న స్పందించారు. ఎవరు ఏమన్నా ఇప్పుడు స్పందించనని, పార్టీకి నష్టం కలిగించకూడదనే తాను సైలెంట్గా వుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కేశినేని సంగతి పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేయరన్నారు. రాధా తన సొంత తమ్ముడిలాంటి వాడని నాని స్పష్టం చేశారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో వచ్చిన గెలుపుల్లో కాపులదే సగభాగమని ఆయన పేర్కొన్నారు. చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని.. టీడీపీ వాళ్లు నేను మాట్లాడిన దాన్ని కట్ పేస్ట్ చేసి వీడియోలు వదిలారని నాని ఆరోపించారు. అవి చూసి జన సైనికులు స్పందిస్తున్నారని.. జీవితంలో ఇప్పటి వరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని కొడాలి నాని స్పష్టం చేశారు.
ALso Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు .. గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామనేది కాదు.. బులెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారని కొడాలి నాని చురకలంటించారు. అందరి కోసం పనిచేస్తూ.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయిందని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే తాను రెండు ముక్కలైనా సరే.. రాష్ట్రాన్ని విడిపోనిచ్చేవారు కాదని నాని పేర్కొన్నారు. జగన్ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికి ఉందన్నారు.