అభ్యర్థుల జాబితాలో దానంకు చోటెందుకు లేదంటే.....
తెలంగాణ రాష్ట్రంలో 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్, మరికొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా మరింత ఉత్కంఠ నెలకొల్పారు. ముఖ్యంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ఎవరికి కేటాయించకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్థిని ప్రకటించకపోవడం సస్పెన్షన్ గా మారింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్, మరికొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా మరింత ఉత్కంఠ నెలకొల్పారు. ముఖ్యంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ఎవరికి కేటాయించకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్థిని ప్రకటించకపోవడం సస్పెన్షన్ గా మారింది.
ఖైరతాబాద్ నియోజకవర్గం టిక్కెట్ పై ఆశావాహుల సంఖ్య విపరీతంగా ఉండటంతోనే అభ్యర్థిని కేటాయించలేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్రెడ్డి మళ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. గోవర్థన్ రెడ్డితోపాటు బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు పి.విజయారెడ్డి కూడా ఖైరతాబాద్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు.
ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇక్కడి నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. దానం నాగేందర్ గతంలో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు కూడా. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతోపాటు స్థానికంగా తనకు పట్టుందని టిక్కెట్ తనకు ఇవ్వాలని కేసీఆర్ ను దానం నాగేందర్ గతంలో కోరినట్లు సమాచారం.
అయితే దానం నాగేందర్ ను ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా గోషామహాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్ల తెలుస్తోంది. అందువల్లే గోషామహాల్ నియోజకవర్గం అభ్యర్థిని కూడా ప్రకటించలేదని సమాచారం.
అయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ ఎక్కువ ఉందనే పెండింగ్ లో పెట్టారా లేక దానం నాగేందర్ ను గోషా మహాల్ నుంచి బరిలోకి దింపుతారా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థుల మెుదటి జాబితాను ప్రకటించిన కేసీఆర్ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటనపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.