అఫైర్ అనుమానం: పట్టపగలు భార్యను నరికి చంపిన భర్త
తెలంగాణలోని బెల్లంపల్లిలో దారుణమైన సంఘటన జరిగింది. కూతురు స్నానానికి వెళ్లడం గమనించి, టీవీ సౌండ్ పెంచి ఓ లారీ డ్రైవర్ తన భార్యను పట్టపగలు దారుణంగా నరికి చంపాడు.
బెల్లంపల్లి: అనుమానం పెనుభూతమై ఓ హత్యకు దారి తీసింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. పట్టపగలు గొంతు కోసి ఆమెను హతమార్చాడు. ఈ సంఘటన తెలంగాణలోని బెల్లంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ హెచ్ఓ ఎం. రాజు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.
కాగజ్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్ ఆసిఫ్ కు బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ కు చెందిన షాహిన్ (39)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆసిఫ్ మీద పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్యాపిల్లలను సరిగా చూసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు షహీన్ ను అతనితో పంపించారు.
కొద్ది రోజులు బాగానే గడిచింది. తర్వాత తిరిగి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. నెల రోజులుగా పనికి వెళ్లకుండా ఆసీఫ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ సమయంలోనే భార్యను హత్య చేయడానికి వ్యూహరచన చేశాడు. గురువారం మధ్యాహ్నం కొడుకుని బ్యాంకుకు పంపించాడు. కూతురు స్నానానికి వెళ్లిన సమయంలో టీవీ సౌండ్ పెంచాడు. భార్యతో గొడవ పడి ఆమె గొంతు కోసి చంపేశాడు.
వారి కుమారుడు సోహైల్ పదో తరగతి, కూతురు తమన్నా తొమ్మిదో తరగతి చదవుతున్నారు. భార్యను చంపిన తర్వాత ఆసిఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రహమాన్ సందర్శించారు. షెహీన్ గొంతుపైనా, శరీరం మీద కత్తిపోట్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.