జాతీయ గీతం కోసం నిలబడుతుండగానే.... ప్రమాదం: సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశృతి
సూర్యాపేటలో జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకల్లో అపశృతి చోటు చేసుకొంది. జాతీయ గీతం ఆలపించేందుకు అందరూ ఒక్కసారిగా లేచిన సమయంలోనే గ్యాలరీ కుప్పకూలింది.
సూర్యాపేట: సూర్యాపేటలో జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకల్లో అపశృతి చోటు చేసుకొంది. జాతీయ గీతం ఆలపించేందుకు అందరూ ఒక్కసారిగా లేచిన సమయంలోనే గ్యాలరీ కుప్పకూలింది.
జాతీయ కబడ్డీ పోటీలను సోమవారం నాడు సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ కబడ్డీ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే జాతీయ గీతం ఆలపించేందుకు అందరూ లేచారు. ఇదే సమయంలో మూడో గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. గ్యాలరీపై ఉన్న కూర్చొన్నవారంతా కిందపడిపోయారు. 15 అడుగుల ఎత్తు నుండి గ్యాలరీ కూలిపోవడంతో గ్యాలరీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇనుపచువ్వలు గుచ్చుకొని కొందరు గాయపడ్డారు.
గ్యాలరీ కూలడంతో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైద్రాబాద్ కు తరలించారు. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రితో పాటు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.