కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సిజెఐ గా జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ కేసునే మొదట విచారించారు.  జూలై 23కి వాయిదా వేసింది 

Kanche Gachibowli Land Case : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ మొదటిసారి హైదరాబాద్ లోని 400 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపారు. ఈ కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణను జూలై 23కి వాయిదా వేసింది న్యాయస్థానం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సిజెఐ జస్టిస్ గవాయ్ ఘాటు కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. డజన్ల కొద్ది బుల్డోజర్లను పెట్టిమరీ అడవి మొత్తాన్ని తొలగించేందుకు సిద్దమయ్యారు... దీన్నిబట్టి ఈ చెట్లను తొలగించాలని ముందుగానే ప్లాన్ చేసినట్లు ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్‌ సహా కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అసలు ఈ వ్యవహారంలో పర్యావరణ అనుమతలు తీసుకున్నారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ లో చెట్లను తొలగించి భూమిని చదునుచేసే పనులు ఎందుకు చేపట్టారు? అని అడిగారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు చేపట్టిన చర్యలగురించి స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం కోరింది.

అయితే ప్రస్తుత కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగడంలేదని ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర సాధికారక కమిటీ నివేదికను సమర్ఫించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా జూలై 23 కు వాయిదా వేసింది న్యాయస్థానం.

కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ లో ఏకంగా 400 ఎకరాల్లో అడవిని నరికి ఆ ప్రాంతాన్ని డెవలప్ మెంట్ కోసం వాడుకోవాలని రేవంత్ సర్కార్ భావించింది. కానీ ఈ నిర్ణయంపై తీవ్ర రాజకీయ, ప్రజావ్యతిరేకత ఎదురయ్యింది. ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిగా పేర్కొంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో చెట్ల నరికివేత పనులు ఆగిపోయాయి.

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు నమోదయ్యాయి. వీటిపై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది... తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేసింది జస్టిస్ గవాయ్ బెంచ్.