క్రైమ్-వీక్లి రౌండప్: కాటేస్తున్న సోషల్ మీడియా
రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతులు, గృహిణులను ట్రాప్ చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యవహారం కలకలం రేపింది. సుమారు 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది మహిళలు, యువతులు ఇతడి బారిన పడినట్లు దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు ఖంగుతిన్నారు
రిసెప్షనిస్ట్ ఉద్యోగాల పేరుతో 600 మందికి వల:
రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతులు, గృహిణులను ట్రాప్ చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యవహారం కలకలం రేపింది. సుమారు 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది మహిళలు, యువతులు ఇతడి బారిన పడినట్లు దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు ఖంగుతిన్నారు.
చెన్నైకి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి టీసీఎస్లో నైట్ షిప్ట్కు వెళ్లేవాడు. పగటి పూట క్వికర్. కామ్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల వివరాలు, ఫోన్ నెంబర్లను సేకరించి.. అమ్మాయి పేరుతోనేరుగా ఫోన్ చేసి ఇంటర్వ్యూలు చేసేవాడు.
అలా మాటల్లో దించి.. యువతుల ఫుల్ ఫోటోతో పాటు వివిధ భంగిమల్లో వారి ఫోటోలు సేకరించి ఉద్యోగానికి ఎంపికయ్యేవారని చెప్పేవాడు. అనంతరం రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి శరీరాకృతి అందంగా ఉండాలని చెబుతూ.. వారి నగ్న ఫోటోలు పంపాలని చెప్పడంతో యువతులు, మహిళలు అందుకు అంగీకరించి నగ్న చిత్రాలు పంపేవారు.
అనంతరం వారికి నేరుగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడు. విషయం ఎవరికైనా చెబితే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. ఆ విధంగా సుమారు 600 మంది యువతుల నగ్న చిత్రాలను ప్రదీప్ సేకరించాడు. ఇతని వేధింపులు భరించలేకపోయిన మియాపూర్కు చెందిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రదీప్ బాగోతం బయటపడింది.
తేజస్విని హత్య:
ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన తేజస్విని వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెడుతోందన్న కోపంతో ప్రియురాలిని నితిన్ అనే యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సత్తుపల్లికి చెందిన నితిన్, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్విని సత్తుపల్లిలో డిప్లోమా చదువుతున్న రోజుల నుంచి ప్రేమించుకున్నారు. అయితే మూడు నెలలుగా నితిన్ ఫోన్ చేసినప్పటికీ తేజస్విని సరిగా మాట్లాడటం లేదని.. వేరే వాళ్లతో మాట్లాడుతూ.. తనను దూరం పెడుతోందని నితిన్ అనుమానించాడు.
ఆమెపై ఆగ్రహంతో ఎలాగైనా చంపాలని కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో మాయమాటలు చెప్పి.. మాట్లాడాలని ఇంటి వెనుక నుంచి తీసుకెళ్లి.. బైక్పై టేకులపల్లి మీదుగా కొత్తలంకపల్లి గుట్టల వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
మాట్లాడుతున్నట్లు నటించి.. జేబులోంచి కర్చీఫ్ను తీసి తేజస్విని మెడకు బలంగా బిగించాడు. ఆమె శరీరాన్ని తగులబెట్టాలని భావించి ముందుగానే పెట్రోల్ తీసుకెళ్లాడు. అయితే రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా ఉండటంతో భయపడి తేజస్విని మృతదేహాన్ని, బైక్ను అక్కడే వదిలి పారిపోయాడు.
తమ కుమార్తె మూడు రోజులైనా కనిపించకపోవడంతో తేజస్విని తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా ఆరా తీశారు.
ఈ క్రమంలో శుక్రవారం లంకపల్లి పొదల వద్ద ఉన్న బండి కోసం వచ్చి.. అది తీస్తుండగా పోలీసులు గుర్తించి.. నిందితుడు నితిన్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ఫేస్బుక్ ప్రాణం తీసింది:
తెలిసి తెలియని వయసులో యువత సోషల్ మీడియా కేటుగాళ్లకు చిక్కి తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన పదో తరగతి విద్యార్ధిని హత్య కేసు ఈ కోవకే చెందుతుంది.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కోహెడ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డికి, హర్షిణికి మూడు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇది నెంబర్లు మార్చుకుని ఛాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది.
ఈ క్రమంలో ఆగస్టు 27న నవీన్ రెడ్డి జడ్చర్లకు వచ్చి హర్షిణికి ఫోన్ చేసి.. బయటకు వెళ్దామని పిలిచాడు. అనంతరం ఆమెను కారులో శంకరాయపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీనికి హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితుడు నవీన్ రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్య:
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్యకు గురికావడంతో నగరం ఉలిక్కిపడింది. ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ బాబు విదేశాల్లో ఎంఎస్ చేసి.. విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేవాడు.
ఈ నేపథ్యంలో నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్ధులకు తరగతులను బోధించడంతో పాటు కన్సల్టెన్సీ ద్వారా ఐటీ సేవలను అందిస్తున్నాడు. చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ను భాగస్వామిగా చేసుకుని విద్యార్ధులకు శిక్షణ అందించే బాధ్యతలు అప్పగించాడు.
ఈ క్రమంలో హేమంత్ గదిలో సతీశ్ శవమై తేలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ను విచారించగా.. ఓ యువతి కారణంగా సతీశ్ను చంపినట్లు తేలింది. వీరి ఐటీ కన్సల్టెన్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సతీశ్ తరగతులు బోధించగా.. హేమంత్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. దీంతో వారిద్దరితో ఆమెకు చనువు పెరిగింది.
ఈ నేపథ్యంలోనే సదరు యువతితో హేమంత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కోసం తన కుటుంబాన్ని దూరంగా ఉంచి.. ఆఫీసుకు దగ్గరలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సతీశ్ బాబుతో సదరు యువతి చనువుగా ఉండటాన్ని గుర్తించిన హేమంత్ స్నేహితుడిపై కోపం పెంచుకుని హత్య చేసి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చిన పబ్జీ:
ఇక పబ్ జీ గేమ్కి బానిసైన ఓ కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మరింత విచారకరం. వనపర్తి జిల్లాకు చెందిన కేశవర్థన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లితో కలిసి వుంటున్న ఈ కుర్రాడు దాదాపు నెల రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా సెల్ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు.
రాత్రిపూట దుప్పటి కప్పుకుని మరి ఆడుకోవడంతో.. పిల్లాడు పడుకున్నాడు కదా అని తల్లి అనుకునేది. చివరికి భోజనానికి రమ్మన్నా వద్దు అనేవాడు. అయితే సమయానికి మంచినీరు, ఆహారం తీసుకోకపోవడంతో కేశవర్ధన్ అరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
వారం క్రితం జ్వరంతో పాటు వాంతులు రావడంతో కంగారుపడిన తల్లి కుర్రాడిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయినప్పటికీ రెండు, మూడు రోజులు జ్వరం తగ్గలేదు. చివరికి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్ధితి విషమంగా మారింది.
కుడికాలు, కుడి చేయి కదపలేని స్ధితికి చేరడంతో కేశవర్థన్ను సికింద్రాబాద్లోని సన్షైన్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యుల బృందం.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి కారణంగా శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలు తగ్గి మెదడుపై పెను ప్రభావం చూపిందని వైద్యులు తేల్చారు.
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడినట్లు గుర్తించారు. చికిత్స అనంతరం యువకుడిని డిశ్చార్జి చేసిన వైద్యులు పబ్జీతో పాటు ఎలాంటి వీడియో గేమ్ ఆడకుండా చూడాలని కేశవర్ధన్ తల్లికి చెప్పి పంపారు.