బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి అదృశ్యమయ్యాడు. మూడు రోజులనుంచి అతను కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలోబన్ని అనే విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ ఉంటున్న బన్నీ మూడు రోజులనుంచి కనిపించకుండా పోయాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్ని మిస్సయ్యాడు. అతని ఫోన్ కూడా స్విఛాఫ్ చేసి ఉంది. 

విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం..తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం నాడు హాస్టల్ కు వచ్చి ఆరాతీశారు.

కాగా, బన్నీ ఇంటికి వెడుతున్నానని చెప్పి మూడు రోజుల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీసింది. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం.. ఇంటికి వెడుతున్నాని చెప్పి బయల్దేరడంతో తల్లిదండ్రులు భయాందోళనల్లో ఉన్నారు. 
చదువుల ఒత్తిడి వల్లే ఇలా చేశాడా? అని మరోవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.