చికెన్ కర్రీ కోసం గొడవ... తండ్రిని హతమార్చిన కొడుకు
మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్.. కోడి కూర వండి పెట్టాలని కొడుకు ఖాసీంతో గొడవ పడ్డాడు. లేకుంటే చంపుతానని బెదిరించాడు. నిత్యం తాగి వస్తున్న తండ్రి వేధింపులు భరించలేక అతణ్ని హతమార్చాలని ఖాసీం నిర్ణయించాడు.
చికెన్ కూర కోసం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. చివరకు ఆ గొడవ కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు పోయేదాకా దారితీసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..భీమదేవరపెల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్ మదార్ (40) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం బండరాయి కొట్టే పనికి కుదురుకున్నాడు. ఈ పని కోసమే రెండు నెలల క్రితం శంకరపట్నం మండలం కొత్తగట్టు కి వచ్చి అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్.. కోడి కూర వండి పెట్టాలని కొడుకు ఖాసీంతో గొడవ పడ్డాడు. లేకుంటే చంపుతానని బెదిరించాడు. నిత్యం తాగి వస్తున్న తండ్రి వేధింపులు భరించలేక అతణ్ని హతమార్చాలని ఖాసీం నిర్ణయించాడు. మంగళవారం అర్ధరాత్రి మదార్ నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మోది హత్య చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.