జర్మనీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాకపోతే సజీవదహనం అవుతా: దీక్షలో అతను
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ను వేములవాడకు తిరిగి రప్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త శేఖర్ దీక్షకు పూనుకున్నాడు.
వేములవాడ: ప్రజలు ఓటు వేస్తే గెలిచి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఏడాదిగా జర్మనీలో ఉంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వేములవాడకు తిరిగి రావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ఆయన స్వదేశానికి రాకపోతే సజీవ దహనం చేసుకుంటాననీ శేఖర్ అనే సామాజిక కార్యకర్త దీక్షకు పూనుకున్నాడు.
ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన రమేష్ బాబు చట్టాన్ని ఉల్లంఘించి ఏడాదైనా పత్తా లేకుండా పోయాడని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోకుండా జర్మనీలోనే ఉంటున్నాడన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవలు చేయాల్సిన నాయకుడు జాడలేకుండా పోతే పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. రెండో దఫా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజల బాగోగుల గురించి వదిలేసి జర్మనిలో ఉంటున్న ఎమ్మెల్యే మాకేందుకు.. అధికారులు స్పదించి వెంటనే ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలనీ దీక్ష చేస్తున్నట్టు శేఖర్ తెలిపారు.
అధికార బలంతో ఓట్ల సమయంలో మాత్రమే వేములవాడ లో కనిపిస్తాడని.... మిగతా పదవీ కాలాన్ని వృథా చేస్తూ ఎక్కడకి పోతున్నాడో నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా పోతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ప్రజలు, కార్మికులు, కర్షకులు కలసి రావాలని కోరారు.
ఎమ్యెల్యే వేములవాడకు వచ్చేలా కలెక్టర్ స్పందించక పోతే గురువారం సాయంత్రం వరకు చూసి, పెట్రోల్ పోసుకొని సజీవదహనం చేసుకుంటాననీ హెచ్చరించారు. ఒక వేళ రమేష్ బాబు రాకపోతే ఎమ్మెల్యే తో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు తన చావుకు కారణమని సూసైడ్ నోటు రాసి చనిపోతానని హెచ్చరించారు.