సబ్సిడీ పేరుతో కార్ల విక్రయం: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
కార్లను అద్దెకు తీసుకొని సబ్సిడీ కార్ల పేరుతో బహిరంగమార్కెట్లో విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.
హైదరాబాద్: కార్లను అద్దెకు తీసుకొని సబ్సిడీ కార్ల పేరుతో బహిరంగమార్కెట్లో విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరుగురు ముఠా సభ్యులు కార్లను విక్రయిస్తున్నారని సీపీ చెప్పారు. ప్రముఖ కంపెనీ నుండి కార్లను అద్దెకు తీసుకొని కార్లను విక్రయించేవారన్నారు.
ఈ ముఠాలో నరేష్, బాదావత్ రాజు కీలక నిందితులని సజ్జనార్ చెప్పారు. ప్రభుత్వం నుండి సబ్సిడీలో కార్లు వస్తున్నాయని మోసం చేశారని సజ్జనార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ఈ ముఠా సభ్యులు కార్లను విక్రయించారని ఆయన తెలిపారు. ఈ ముఠా నుండి 50 కార్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా సీపీ తెలిపారు.
ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో కార్ల స్కాం గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. రూ. 4 కోట్ల విలువైన 50 కార్లను స్వాధీనం చేసుకొన్నామని ఆయన తెలిపారు. సబ్సిడీ., వేలం, మార్టిగేజ్ వాహనాలుగా నమ్మించి కార్లను విక్రయించారని సీపీ చెప్పారు.