కాంగ్రెస్ పార్టీ నుండి ఆరుగురిని బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది .  వీరిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు కూడ ఉంది.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి ఆరుగురిని బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది . వీరిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు కూడ ఉంది.

సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, రమ్యారావు, క్రిశాంక్, నరేష్ జాదవ్, సోయం బాబురావులను బహిష్కరించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన శివకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కూడ ఆ పార్టీ ఎత్తివేసింది. మాజీ మంత్రి సబితా రెడ్డి ఇటీవలనే కార్తీక్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ను కలిశారు. సబితా ఇంద్రారెడ్డి తన ఇద్దరు కొడుకులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఆరేపల్లి మోహన్ ఆదివారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు.

రమ్యారావు టీఆర్ఎస్‌లో చేరారు. ఆమె కేసీఆర్‌ కు సమీప బంధువు. ఇంత కాలం పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ ‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ, ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు.