దిశ నిందితుల ఎన్కౌంటర్పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు
దిశ నిందితుల ఎన్కౌంటర్పై పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆరా తీశారు.
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన చటాన్పల్లి వద్ద దిశ నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రెండో రోజు కూడ విచారణ జరిపారు.
ఈ నెల 4వ తేదీన నిందితులను కస్టడీకి ఇస్తూ షాద్నగర్ కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకొన్నారు. పోలీసులు నిందితులను ఈ కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకొన్నట్టుగా సైబరాబాద్ సీపీ ప్రకటించారు.
ఈ ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేస్తోంది.సోమవారం నాడు తొలి రోజున ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించారు. మంగళవారంనాడు కూడ పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు విచారణ చేశారు.
నిందితులను కస్టడీకి తీసుకొన్న సమయం నుండి ఎన్కౌంటర్ చోటు చేసుకొన్న రోజు వరకు దారి తీసిన పరిస్థితులను పోలీసుల నుండి జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సేకరించారు.
Also read:దిశ కేసు: ఎన్హెచ్ఆర్సీకి సైబరాబాద్ పోలీసుల నివేదిక
పోలీసుల శరీరాలపై ఉన్న గాయాల గురించి డాక్టర్లను ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు ప్రశ్నించారు. గాయాలు కావడానికి గల కారణాల గురించి వైద్యులను జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు.
చటాన్పల్లి వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు తమపై కర్రలతో దాడి చేశారని పోలీసులు చెప్పారు. కర్రలతో దాడి చేసి తమ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ను నిందితులు ఎత్తుకుపోయారని పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు చెప్పారు.
నిందితులు కొంత దూరం పారిపోయిన తర్వాత తమపై కాల్పులకు దిగారని పోలీసులు చెప్పారు. ఈ సమయంలోనే తాము ఆత్మరక్షణకు కాల్పులకు దిగినట్టుగా పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు చెప్పారు.