దారుణం.. భార్యపై ఎంపీడీవో దాడి.. వేడి నీళ్లు పోసి.. కత్తితో గాట్లు పెట్టి..
పెళ్లి జరిగినప్పటి నుంచి తనను భర్త వేధిస్తున్నాడని చెప్పారు. రెండు చేతులపై వేడి నీళ్లు పోయడంతో బొబ్బలు వచ్చాయన్నారు.
ఆమెకు గౌరవ ప్రదమైన ఉద్యోగం ఉంది... మంచి జీతం అందుకుంటున్నాడు. ఆయనను కింది స్థాయి ఉద్యోగులు, ప్రజలు చాలా గౌరవిస్తారు.. కానీ అవన్నీ ఆఫీసుకే పరిమితమయ్యాయి., ఇంటికి చేరాక..అతను రాక్షసుడిగా మారుతున్నాడు. భార్యను నానా రకాలుగా హింసించడం మొదలుపెడుతున్నాడు. వేడి నీటిని పోయడం.. కత్తులతో గాయాలు చేయడం లాంటివి చేసి రాక్షసానందం పొందుతున్నాడు. అదనపు కట్నం తేవాలంటూ హింసిస్తున్నాడు. అతని బాధలు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కాగజ్ నగర్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..... సిర్పూరు(టీ) ఎంపీడీవో జగదీశ్ అనిల్ భార్య మేరీ కుమారి ఆదివారం కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్లో మీడియాతో మాట్లాడారు. గుంటూరుకు చెందిన తనకు జగదీశ్తో 2018, అక్టోబరు 15న వివాహమైనట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు రూ.52 లక్షలకట్నం ఇచ్చి పెళ్లి చేశారన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి తనను భర్త వేధిస్తున్నాడని చెప్పారు. రెండు చేతులపై వేడి నీళ్లు పోయడంతో బొబ్బలు వచ్చాయన్నారు.
అదనపు కట్నం కావాలని తనపై రెండు రోజుల క్రితం కత్తితో దాడి చేశాడని చెప్పారు. చేతులపై గాట్లు పెట్టాడని, ఇంటి వద్ద ఉండవద్దని గెంటేస్తున్నాడని తెలిపారు. తన భర్తను జైలుకు పంపాలని, తనకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై తాను ఎస్పీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.