పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా: సిరిసిల్ల రాజయ్య
వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య చెప్పారు.
వరంగల్: వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య చెప్పారు.
2016 లో కోడలు, ముగ్గురు మనమలు ఆత్మహత్య చేసుకొన్న ఘటన తర్వాత సిరిసిల్ల రాజయ్యపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.ఈ ఏడాది ఆరంభంలో రాజయ్యపై విధించిన సస్పెన్షన్ను కాంగ్రెస్ పార్టీ ఎత్తేసింది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేత సిరిసిల్ల రాజయ్య సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. కానీ, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు తాను సిద్దమౌతున్నట్టు ఆయన ప్రకటించారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో తాను చేసిన కృషిని ఆయన వివరించారు. కేసీఆర్ ఎందుకు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.