‘నా కొడుకును చంపినోళ్లతో తిరుగుతున్నావ్...’
ఎన్నికల ప్రచారంలో అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ఓ మహిళ వేసిన ప్రశ్నకు ఆయనకు దిమ్మతిరిగిపోయింది.
ఎన్నికల ప్రచారంలో అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ఓ మహిళ వేసిన ప్రశ్నకు ఆయనకు దిమ్మతిరిగిపోయింది. సమాధానం చెప్పలేక నోరెళ్ల పెట్టాడు. తర్వాత ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు.
‘‘నా కొడుకును నడిరోడ్డుపై హత్య చేసిన వారిని వెంటబెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావ్? వారిని నువ్వు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు?’’ అంటూ అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు ఓ మహిళ వేసిన ప్రశ్న ఇది.
గురువారం తాటి.. ప్రచారం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సానుభూతి పరుడు శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబరులో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ ఘటనలో నిందితులుగా ఉన్న కొందరిని తాటి వెంకటేశ్వర్లు వెంటబెట్టుకొని తిరుగుతున్నారంటూ మృతుని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా శ్రీనివాస్ హత్యను తాను ఖండించానని.. ప్రచారంలో తన వెంట ఎందరో వస్తుంటారని, ఎవరనేది చూసే పరిస్థితి ఉండదని ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమయింది.