తెలంగాణ ఎన్నికలు: జగన్ పార్టీలో శివకుమార్ చిచ్చు, శాశ్వత బహిష్కరణ
శివకుమార్ ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. పార్టీ నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పా్రటీ ఏ రాజకీయ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇది పార్టీ అధికారిక విధానమని చెప్పింది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె. శివ కుమార్ ప్రయత్నించారు. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెసుకు మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడిగా ఆయన మంగళవారం ఆ మేరకు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణకు ఎంతో చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని దుర్మార్గుడు అంటూ వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్న మాటలను ఖండిస్తూ దానికి నిరసనగా టీఆర్ఎస్ కు ఓటు వేయకూడదని, 2018 తెలంగాణ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయనందున కాంగ్రెసు పార్టీతో వైఎస్సార్ చివరి శ్వాస వరకు ఉన్నారు కాబట్టి వైఎస్సార్ అభిమానుల పూర్తి మద్దతు కాంగ్రెసు పార్టీకి ప్రకటిస్తున్నామని ఆయన ప్రకటనలో అన్నారు.
శివకుమార్ ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. పార్టీ నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పా్రటీ ఏ రాజకీయ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇది పార్టీ అధికారిక విధానమని చెప్పింది. ఈ విధానాన్ని పార్టీ యింతకు ముందే ప్రకటించిందని, ఇందులో ఏ విధమైన మార్పు లేదని కూడా గుర్తు చేసింది.
తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలనే అంశం మీద తమ పార్టీ ఓటర్ల ఆత్మసాక్షికే నిర్ణయాన్ని వదిలేసిందని చెప్పింది. అయితే ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె. శివకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారని చెప్పింది.
పార్టీ లెటర్ హెడ్ ఉపయోగించి కె. శివకుమార్ ఈ రోజు ఇచ్చిన ప్రకటనను తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా భావించి పార్టీ క్రమశిక్షణా సంఘం అత్యవసరంగా చర్చించి ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుందని ఆ ప్రకటనలో వివరించారు.