ఈనెలాఖరున సోనియాగాంధీ తెలంగాణ పర్యటన
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని ఈనెల 23 లేదా 30న తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
ఈ నెలాఖరున యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ పర్యటన ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. ఈనెల 23 లేదా 30న మెదక్ జిల్లా గజ్వేల్ లేదా సూర్యాపేటలో ఎన్నికల బహిరంగ సభలో సోనియాగాంధీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది.
సూర్యాపేట లేదా గజ్వేల్ లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల నాయకులతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో సోనియాగాంధీ బహిరంగ సభ పెట్టాలా లేక మెదక్ జిల్లాలోని వేరే ప్రాంతంలో పెట్టాలా అని నాయకులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో సభ పెడితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.