మంత్రి ఈటెల రాజేందర్ మీద భూకబ్జాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్వగ్రామం కమలాపూర్ లో భారీగా పోలీసులు మోహరించారు. అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామమైన కమలాపూర్ లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పై క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపథ్యలో ఈటల రాజేందర్ సొంత ఊరైన కమలాపూర్ లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు కమలాపూర్ లో బందో బస్తు చేపట్టినట్టు సమాచారం. ఈటలపై శుక్రవారం ఆరోపణలు వచ్చిన వెంటనే కమలాపూర్ లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఫ్లెక్సీనీ ఈటల అనుచరులు దగ్దం చేశారు. 

దీంతో ఈటల అనుచరులు ఆందోళనలు చేపట్టడం కానీ, ఇతరాత్ర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు.

జమున హాచరీస్ కోసం ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఈటెల రాజేందర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తనకు బదిలీ చేసుకున్నారు.