Secunderabad Violence: వెలుగులోకి రైళ్లకు నిప్పుపెడుతున్న వీడియోలు.. ఏ-2గా ఆదిలాబాద్కు చెందిన పృథ్వీరాజ్..
అగ్నిపథ్ వ్యతిరేకంగా నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆందోళనకారులు రైలు బోగీలకు నిప్పుపెడుతున్న, రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలువులోకి వచ్చాయి.
అగ్నిపథ్ వ్యతిరేకంగా నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైళ్లకు నిప్పుపెట్టడం.. వెనక కొందరు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు తొలుత రైల్వే బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ ఈ దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయి. ఆ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినకు పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు.. రైలు బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడు. ఆ దృశ్యాలను వీడియోలు కూడా తీయించుకున్నాడు.
ఒకరిద్దరు ఇలాంటి చర్యలు దిగిన తర్వాత మరికొందరు రైల్వే ఆస్తుల ధ్వంసం చేయడానికి, రైల్వే బోగీలకు నిప్పుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అల్లర్లకు సంబంధించి పృథ్వీరాజ్ను ఏ-2 చేర్చారు. అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్ను ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు 56 మందిని నిందితులుగా గుర్తించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసంలో వాట్సాప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎనిమిది వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక్క వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్ ను పోలీసులు విచారించిని విషయం తెలిసిందే.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావును తెలంగాణ కు చెందిన టాస్క్ పోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుండి నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత ఆవుల సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆవుల సుబ్బారావు ను రైల్వే పోలీసులు నేడు విచారించనున్నారు.