ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  సంక్రాంతి కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. ఎకరం నుంచి ప్రారంభమై వరుసగా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. 

కాగా.. తెలంగాణలో మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతుల కోసం రెండు ముఖ్యపథకాలు తీసుకొచ్చింది. అందులో ఒక‌టి రైతుబంధు కాగా మ‌రొక‌టి రైతుబీమా. ఈ రెండు ప‌థ‌కాల‌ను రైతులను విశేషంగా ఆక‌ర్షించాయి. గ‌తంలో ఉన్న ఏ ప్ర‌భుత్వాలు ఇలాంటి ప‌థ‌కాలు తీసుకురాక‌పోవ‌డంతో సీఎం కేసీఆర్ ఈ రెండు ప‌థ‌కాల‌తో రైతుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప‌ట్ట‌దారు పాసు పుస్త‌కం ఉన్న రైతు చ‌నిపోతే ఏ కార‌ణంతో చ‌నిపోయినా కుటంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా అందించ‌డం రైతు బీమా ప‌థ‌కం ఉద్దేశ‌మైతే, పంట పెట్టుబ‌డికి కావాల్సిన ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూర్చ‌డం రైతుబంధు ప‌థ‌కం ఉద్దేశం. 

ALso REad: తెలంగాణ రైతాంగానికి శుభవార్త.. డిసెంబర్‌లోనే రైతుబంధు : మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన

ప్ర‌తీ ఏటా రెండు విడ‌త‌లుగా అంటే వానాకాలం సీజ‌న్‌కు ముందు, యాసంగి సీజ‌న్‌కు ముందు ఎక‌రానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబ‌డికి ప్ర‌భుత్వం సాయంగా అందిస్తోంది. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో క్రిడిట్ అవ‌డం, మ‌ధ్య‌లో ఎలాంటి వారికి డ‌బ్బులు చెల్లించాల్సి రాక‌పోవ‌డంతో రైతులు ఈ ప‌థ‌కం ప‌ట్ల బాగా ఆక‌ర్శితుల‌య్యారు. టీఆర్ఎస్‌ను రెండో సారి అధికారంలోకి తీసుకురావ‌డానికి ఈ ప‌థ‌కం కీల‌క పాత్ర పోషింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.