ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్ గుండెపోటుతో మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోకు చెందిన రాజేందర్ గుండెపోటుతో మంగళవారం నాడు మృతి చెందాడు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ బస్సు డిపోలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్ గుండెపోటుతో మంగళవారం నాడు మృతి చెందాడు. గుండెపోటు రావడంతో రాజేందర్ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేందర్ మృతి చెందాడు.
Also read:వారి ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజేందర్ స్వస్థలం ఎడవల్లి మండలం మంగల్పాడ్ గ్రామానికి చెందినవాడు. సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనోవేదనకు గురైన రాజేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. రాజేందర్ బోధన్ డిపోలో డ్రైవర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నాడు.
ప్రభుత్వ ప్రకటన విషయమై తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా రాజేందర్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. రాజేందర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ఈ నెల 25వ తేదీన ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుండి విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.ఆర్టీసీ లేబర్ కోర్టు నిర్ణయం మేరకే నడుచుకొంటామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం ఆర్టీసీ డిపోల వద్దకు విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను విధుల్లోకి తీసుకోలేదు ఆర్టీసీ యాజమాన్యం. డిపోల వద్ద విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.