జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్దం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్కు వస్తుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 44వ నెంబర్ జాతీయ రహదారిపై జడ్చర్ల సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. రోడ్డుపక్కన బస్సును నిలిపివేసి ప్రయాణికులను అలర్ట్ చేశాడు.
ప్రయాణికులంతా కిందకు దిగిన అనంతరం... బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక, బస్సులోని ప్రయాణికులను.. ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది.