రైతు ఖాతాలో రూ. 473 కోట్లు.. తీరా బ్యాంకుకు వెడితే...
మీకు తెలియకుండా మీ అకౌంట్లో వందల కోట్ల డబ్బు జమైతే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా మైండ్ బ్లో అవుతుంది కదా.. అలాగే జరిగింది ఓ రైతుకు. ఏకంగా రూ. 473 కోట్లు జమైంది. అది చూసి ఆశ్చర్యపోయి బ్యాంకుకు పోతే అలాంటిదేం లేదని నాలుగువేలు మాత్రమే ఉన్నాయని చెప్పి పంపారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
మీకు తెలియకుండా మీ అకౌంట్లో వందల కోట్ల డబ్బు జమైతే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా మైండ్ బ్లో అవుతుంది కదా.. అలాగే జరిగింది ఓ రైతుకు. ఏకంగా రూ. 473 కోట్లు జమైంది. అది చూసి ఆశ్చర్యపోయి బ్యాంకుకు పోతే అలాంటిదేం లేదని నాలుగువేలు మాత్రమే ఉన్నాయని చెప్పి పంపారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు వెళ్లాడు. అక్కడి డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు.
ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. తన ఖాతాలో రూ.473,13,30,000 అని చూసి షాక్ తిన్నాడు. అంత డబ్బు తన ఖాతాలో ఉండడమేంటని డౌట్ వచ్చింది.. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్ చూపించింది.
అయితే డబ్బులు మాత్రం డ్రా కావడం లేదు. దీంతో అదేంటో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి ‘మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు.
ఏటీఎం రిసిప్ట్లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది.