బాలానగర్ ఫ్లై ఓవర్పై ప్రమాదం.. యువకుడి మృతి, అతివేగమే కారణం
హైదరాబాద్ బాలానగర్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ యువకుడి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అతి వేగం, హెల్మెట్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
హైదరాబాద్ బాలానగర్లో ఇటీవల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఫ్లై ఓవర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పిన ఓ యువకుడు ఫ్లై ఓవర్ డివైడర్ను ఢీకొట్టి మరణించాడు. మృతుడిని ప్రకాశం జిల్లా కొణిదెనకు చెందిన అశోక్ (24)గా గుర్తించారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఇతను హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో లైసెన్స్ తీసుకునేందుకు ఈ ఉదయం తిరుమలగిరి కార్యాలయానికి బైక్పై బయలుదేరాడు.
బాలానగర్ ఫ్లై ఓవర్ పైనుంచి అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న డివైడర్ను ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు