దైవదర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం... భార్య మృతి, భర్త పిల్లలకు తీవ్ర గాయాలు
దైవదర్శనానికి వెళుతుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయి మహిళ మృత్యువాతపడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సిద్దిపేట: దైవదర్శనానికి వెళుతుండగా ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన వైద్యుడు చిప్ప రమేష్-స్వరూప రాణి భార్యాభర్తలు. వీరికి కావ్యనాయుడు, శ్రావ్యనాయుడు ఇద్దరు కూతుర్లు. వీరంతా కలిసి సరదాగా దైవదర్శనం కోసం బుధవారం వేములవాడకు బయలుదేరారు. తన అన్న కొడుకు అజయ్ కుమార్ ను కూడా తమవెంట తీసుకువెళ్లాడు రమేష్.
అయితే వీరు ప్రయాణిస్తున్న కారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారుకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రాజీవ్ రహదారిపై వేగంగా వెళుతున్న కారు రోడ్డు మద్యలోని డివైడర్ ను ఢీకొని ఎగిరి అవతలి వైపు పల్టీ కొట్టింది.
read more భర్తను వదిలేసి ప్రియుడితో పరార్.. అతను నగలు తీసుకొని..!
ఈ ప్రమాదంలో స్వరూపరాణి(49) తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మిగతా కుటుంబసభ్యులు కూడా తీవ్ర గాయాలతో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. అజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దైవదర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో తల్లిని కోలపోవడంతో కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు.